కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: కేటీఆర్
- గ్రామీణ, మండల స్థాయి జర్నలిస్టులకు కనీస గౌరవం కూడా లేదన్న కేటీఆర్
- జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్
- ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని వ్యాఖ్య
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ, మండల స్థాయి జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి కనీస గుర్తింపు, గౌరవం లేకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల హెల్త్ కార్డ్స్, ఇళ్ల స్థలాలు, అర్హులైన విలేకరులందరికీ కొత్త అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. "రైతులకు రూ.2 లక్షల ఏకకాల రుణమాఫీ అని చెప్పి సగం మందికే చేశారు. రైతు భరోసా, విద్యార్థులకు విద్యా భరోసా కార్డ్లు అడ్రస్ లేవు. నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల కల్పన అని చెప్పి నమ్మించి నట్టేట ముంచారు" అని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనపై జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని... అటు కరెంట్ కోతలు, ఇటు సాగునీటి ఇబ్బందులు చూసి మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు.